Friday, 4 November 2016

Non Vegetable cooking items ( రుచి - అభిరుచి , నాన్ వెజ్ వంటకాలు) - 2

ఆంధ్రా కోడి కూర

కావలసినవి:
చికెన్‌: అరకిలో, అల్లంవెల్లుల్లి: 5 టీస్పూన్లు,కారం: 5 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: 4 టేబుల్‌స్పూన్లు, ఉల్లిముక్కలు: 2 కప్పులు,టొమాటో గుజ్జు: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: 2 రెబ్బలు, దనియాలపొడి: 2 టీస్పూన్లు, మిరియాలపొడి: అరటీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లుమసాలాకోసం: జీలకర్ర: టీస్పూను, సోంపు: అరటీస్పూను, లవంగాలు: 4, యాలకులు: రెండు, దాల్చినచెక్క: అంగుళంముక్క, గసగసాలు: టేబుల్‌స్పూను.

తయారుచేసే విధానం: 
చికెన్‌ ముక్కల్ని బాగా కడిగి 4 టీస్పూన్ల కారం, 4 టీస్పూన్ల అల్లంవెల్లుల్లి, తగినంత ఉప్పు పట్టించి అరగంటసేపు నాననివ్వాలి.  పచ్చిమిర్చిని కూడా సన్నగా తరగాలి. బాణలిలో మసాలా కోసం తీసుకున్నవన్నీ వేయించి చల్లారాక పొడి చేసి ఉంచాలి.  బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, కరివేపాకు, మిగిలిన అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. తరవాత చికెన్‌ ముక్కలు, గరంమసాలా, మిగిలిన కారం, దనియాల పొడి వేసి బాగా కలపాలి. నాలుగైదు నిమిషాలు ఉడికిన తరవాత టొమాటో గుజ్జు వేసి నూనె తేలేవరకూ ఉడికించాలి. ఇప్పుడు సుమారు ఓ కప్పు నీళ్లు పోసి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి మరికాసేపు ఉడికించి కొత్తిమీర తురుము జల్లి దించాలి.

మటన్‌తో కాశ్మీరీ బిర్యానీ

కావలసినవి:
మటన్‌: ముప్పావుకిలో, బాస్మతిబియ్యం: కిలో, పాలు: 200 మి.లీ., పెరుగు: 2 టీస్పూన్లు, శొంఠిపొడి: టీస్పూను, యాలకులపొడి: పావుటీస్పూను, నెయ్యి: కప్పు, కెవ్రా ఎసెన్స్‌: పావుటీస్పూను, కుంకుమపువ్వు: 2 గ్రా., కారం: 2 టీస్పూన్లు, ఇంగువ: చిటికెడు, గరంమసాలా: 2 టీస్పూన్లు, సోంపుపొడి: 2 టీస్పూన్లు, పంచదార: పావుటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేసే విధానం:
బాణలిలో నెయ్యి వేసి కాగాక ఇంగువ, మటన్‌ ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. అందులోనే పెరుగు కూడా వేసి కలిపి రంగుమారేవరకూ వేగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, కారం, సొంఠిపొడి, పలావు ఆకు వేసి కాసేపు వేయించాలి. తరవాత అరలీటరు నీళ్లు పోయాలి. అరటీస్పూను గరంమసాలా, టీస్పూను సోంపుపొడి వేసి సిమ్‌లో ఉడికించి దించాలి. మటన్‌ముక్కల్ని విడిగా ఓ గిన్నెలో వేసి ఉంచాలి. అదే బాణలిలో రెండు లీటర్ల నీళ్లు పోసి ఉప్పు వేయాలి.
ఇప్పుడు గరంమసాలా మిగిలిన సోంపు పొడి అన్నీ పలుచని బట్టలో మూట కట్టి నీళ్లలో వేయాలి. తరవాత బియ్యం వేసి సిమ్‌లో సగం ఉడికేవరకూ ఉంచి దించాలి. తరవాత అందులోనుంచి నీళ్లు వంపేసి మటన్‌ ముక్కలూ అన్నమూ పొరలు పొరలుగా మందపాటి గిన్నెలో వేసి మూతపెట్టి సిమ్‌లో దమ్‌ చేయాలి.

బటర్‌ చికెన్‌

కావల్సినవి: ఎముకల్లేని చికెన్‌ - అరకేజీ, చిక్కని పెరుగు - పావుకప్పు, వెన్న - అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, అల్లం - పెద్ద ముక్క, నూనె - టేబుల్‌స్పూను, ఉప్పు - తగినంత, గరంమసాలా - చెంచా, టొమాటోలు - నాలుగు, యాలకులు - ఏడు, దాల్చినచెక్క - చిన్నముక్క, లవంగాలు - నాలుగు, మెంతిపొడి - చెంచా, పచ్చిమిర్చి - రెండు, జీడిపప్పు - పావుకప్పు (నానబెట్టుకుని ముద్దలా చేసుకోవాలి), కసూరీమేథీ - చెంచా, క్రీం - పావుకప్పు.

తయారీ: ఓ గిన్నెలో పెరుగూ, నూనె, తగినంత ఉప్పూ, గరంమసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్దలా చేసి, సగం పెరుగులో వేసేయాలి. చికెన్‌ ముక్కలపై ఈ పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి.. ఫ్రిజ్‌లో కనీసం నాలుగుగంటలు పెట్టాలి (అయితే దీన్ని ముందురోజు చేసుకుంటే కూర ఇంకా రుచిగా వస్తుంది). ఇంతలో సాస్‌ తయారు చేసుకోవాలి. టొమాటోలను మిక్సీజారులోకి తీసుకుని గుజ్జులా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెన్నను ఓ గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద పెట్టి.. యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్క వేయాలి. వెన్న కరిగాక మెంతిపొడీ, పచ్చిమిర్చి ముక్కలూ, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసేయాలి. తరవాత టొమాటో గుజ్జు వేసి మంట తగ్గించాలి. కాసేపటికి ఇది కూరలా తయారవుతుంది. ఇందులో జీడిపప్పు ముద్దా, కప్పు నీళ్లూ పోయాలి.. తరవాత చికెన్‌ ముక్కలూ, కసూరీమేథీ, గరంమసాలా వేసి మంట తగ్గించాలి. చికెన్‌ ఉడికిందనుకున్నాక క్రీం, మరికొంచెం ఉప్పూ కలిపి దింపేయాలి.

హైదరాబాదీ కీమా 

కావలసినవి
కీమా: పావుకిలో, టొమాటోలు: రెండు, ఉల్లిపాయలు: రెండు,దనియాలపొడి: 2 టీస్పూన్లు, నూనె: అర‌కప్పు, పసుపు: చిటికెడు, బంగాళాదుంపలు: ఐదు,గ‌రంమసాలాపొడి: టీస్పూను, కారం: 3 చెంచాలు, ఉప్పు: తగినంత, అల్లంవెల్లుల్లిముద్ద: 5 చెంచాలు, కొత్తిమీర‌: కట్ట

త‌యారు చేసే విధానం
బాణలిలో నూనె వేసి కాగాక గ‌రంమసాలా పొడి వేయాలి. త‌రువాత‌ ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. పసుపు, కారం, దనియాలపొడి వేసి కలపాలి. ఇప్పుడు కీమా వేసి సుమారు పావుగంటసేపు ఉడికించాలి. త‌రువాత‌ ముక్కలుగా కోసిన బంగాళాదుంప, టొమాటోముక్కలు, ఉప్పు వేసి కలిపి మరో పావుగంటసేపు ఉడికించి, దించేముందు కొత్తిమీర‌ చల్లాలి.

మేక కాళ్ల పాయా

కావలసినవి
మేక కాళ్లు: నాలుగు, కారం: 3 చెంచాలు, ఉల్లిపాయలు: రెండు, పుదీనా ఆకులు: కట్ట (చిన్నది), నూనె: 5 చెంచాలు, కొత్తిమీర‌: కట్ట(చిన్నది), నల్లయాలకులు: రెండు, లవంగాలు: రెండు, దాల్చినచెక్క: అంగుళంముక్క, ఉప్పు: రుచికి సరిపడా, అల్లంవెల్లుల్లిముద్ద: 6 చెంచాలు, పచ్చి కొబ్బరితురుము: 10 చెంచాలు, గసగసాలు: 10 చెంచాలు, పసుపు: చెంచా, పొట్లి మసాలా: 5 చెంచాలు (పలావుఆకు, దనియాలు, గంధం పొడి, ఎండుగులాబీ రేకులు, నల్లయాలకులు, దాల్చినచెక్క, పత్తర్‌ కా పూల్‌, అనాసపువ్వు, కసూరి మెంతి... లాంటివన్నీ కలిపి మసాలానే పొట్లి మసాలా అంటారు. హైదరాబాదీ వంటల్లో దీన్ని ఎక్కువగా వాడ‌తారు. ఇది మార్కెట్లో నేరుగా దొరుకుతుంది), నిమ్మకాయ: ఒకటి
త‌యారీ విధానం
మేక కాళ్లకు పసుపు పట్టించి బాగా కడగాలి. గసగసాలు, కొబ్బరి ముద్దలా చేయాలి. ప్రెషర్‌కుక్కర్‌లో మేక కాళ్లు వేసి సగం కారం, సగం అల్లంవెల్లుల్లిముద్ద, ఉప్పు, పుదీనాతురుము, కొత్తిమీర‌ తురుము, తగినన్ని నీళ్లు పోసి అర‌గంటసేపు సిమ్‌లో పెట్టి ఉడికించాలి. బాణలిలో నూనె వేసి దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, మిగిలిన అల్లంవెల్లుల్లిముద్ద వేసి వేయించాలి. త‌రువాత‌ ఉల్లిముక్కలు, పసుపు, మిగిలిన కారం, దనియాలపొడి వేసి కలిపి వేయించాలి. ఇప్పుడు కొబ్బరి - గసగసాల ముద్ద వేసి ఓ నిమిషం వేయించాలి. త‌రువాత‌ కుక్కర్‌లో ఉడికించిన మేక కాళ్లని నీళ్లతో సహా వేసి ఈ మిశ్రమంలో సుమారు పావుగంటసేపు ఉడికించాలి. ఇప్పుడు పొట్లి మసాలాని ఓ పలుచని బట్టలో మూటలా కట్టి ఆ మూటని అందులో వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి. ఉప్పు సరిచూసి దించి వేడివేడిగా అందించాలి.

చిక్కుడు-చికెన్‌ పలావ్‌

కావలసినవి
బాస్మతి బియ్యం: పావుకిలో, చిక్కుడు గింజలు: పావుకిలో, బోన్‌లెస్‌ చికెన్‌: పావుకిలో, నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు, నూనె: టేబుల్‌స్పూను, ఉల్లిపాయ: ఒకటి, వెల్లుల్లిరెబ్బలు: నాలుగు (సన్నగా తరగాలి), జీలకర్ర: ఒకటిన్నర టీస్పూన్లు, దాల్చినచెక్క: అంగుళంముక్క, పసుపు: టీస్పూను, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, గరంమసాలా: టీస్పూను, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
బియ్యం కడిగి ఉంచాలి. పాన్‌లో సగం నెయ్యి, నూనె వేసి పసుపు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, దాల్చినచెక్క ముక్కలు వేసి వేగాక చికెన్‌ముక్కలు వేసి వేయించాలి. కాస్త వేగాక చిక్కుడు గింజలు వేసి వేయించాలి. బియ్యం వేసి కలిపి సరిపడా నీళ్లు పోసి, గరంమసాలా కూడా వేసి మూతపెట్టి ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము, మిగిలిన నెయ్యి వేసి కలిపి దించాలి.

పులస చేప పులుసు

కావలసినవి:
పులస చేప: కిలో, నూనె: 100 గ్రా., ఉల్లిపాయలు: పావుకిలో,
రాక్‌సాల్ట్‌(సైంధవ లవణం): తగినంత, పసుపు: టీస్పూను, చింత పండుగుజ్జు: అర కప్పు, బెండకాయలు: ఆరు, కొత్తిమీర కట్ట, వెల్లుల్లి: 3 రెబ్బలు, కరివేపాకు: 2 రెబ్బలు,జీలకర్ర: 2 టీస్పూన్లు, ఆవకాయలో తేలే నూనె: 2 టేబుల్‌స్పూన్లు, చేపకారం: 2 టేబుల్‌ స్పూన్లు (కారం, దనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ సమంగా తీసుకుని విడివిడిగా వేయించి పొడి చేయాలి), కొబ్బరి బోండాలు: రెండు(లేదంటే నీళ్లు వాడవచ్చు)
తయారుచేసే విధానం:చింతపండుని గుజ్జులా చేసి కొబ్బరినీళ్లలో నానబెట్టాలి.కాస్త నూనెలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి వీటికి జీలకర్ర, వెల్లుల్లి జోడించి ముద్దలా చేయాలి. బాణలిలో మిగిలిన నూనె వేసి ఉల్లిముద్దని వేయించాలి. శుభ్రంగా కడిగిన చేప ముక్కలు వేసి, కారం చల్లి ఓ నిమిషం ఉడికించాలి. చింతపండు గుజ్జు, కొబ్బరినీళ్ల మిశ్రమం పోసి, బెండకాయ ముక్కలు వేసి ఉడికించాలి. చివరగా ఆవకాయలో పైన తేలే నూనె, వెన్న, కొత్తిమీర తురుము వేసి దించి వేడివేడిగా వడ్డించాలి.

హలీమ్‌

కావల్సినవి:
మాంసం - రెండుకేజీలు, పలుకుల్లా చేసుకున్న గోధుమలు -
మూడుకప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద - నాలుగు టేబుల్‌ స్పూన్లు, మినప్పప్పు, సెనగపప్పు - అరకప్పు చొప్పున, పెరుగు - ఒకటిన్నర కప్పు, వేయించిన ఉల్లి పాయలు -కప్పు, జీడిపప్పు - అరకప్పు, సాజీరా - చెంచా, యాలకులు - రెండు, గులాబీరేకలు - యాభై గ్రా, లవంగాలు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క (ఈ రెండింటినీ కలిపి పొడి చేసుకోవాలి), మిరియాలు - చెంచా, దాల్చినచెక్క - రెండు అంగుళాలు, లవంగాలు - రెండుమూడు, యాలకులు - రెండు, నెయ్యి - అరకప్పు, కొత్తిమీర తరుగు - కప్పు, పుదీనా ఆకులు - పావుకప్పు, పచ్చిమిర్చి - ఐదారు, ఉప్పు - సరిపడా, నూనె - అరకప్పు, పోట్లీ మసాలా - కొద్దిగా (వేడినీటిలో వేసుకోవాలి. ఇది బజార్లో లభిస్తుంది).
తయారీ:
గోధుమల్ని నీటిలో అరగంటసేపు నానబెట్టాలి. మాంసాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మాంసం ముక్కలకు సరిపడా అల్లంవెల్లుల్లిముద్ద, చెంచా ఉప్పు చేర్చి బాగా కలిపి ఉడికించి పెట్టుకోవాలి. అలాగే గోధుమలు, పప్పులు, మూడు నాలుగు పచ్చిమిర్చి, అరచెంచా మిరియాలు, ఎనిమిది నుంచి పదికప్పుల నీళ్లు తీసుకుని అరగంటసేపు ఉడికించాలి. మాంసాన్ని మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి మిగిలిన మసాలా దినుసులు, జీడిపప్పు, ఉల్లిపాయముక్కలు, గులాబీరేకలు, మాంసం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా వేయించాలి. రెండుమూడు నిమిషాలయ్యాక పెరుగు చేర్చి మరో పదిహేను నిమిషాలు వేయించాలి. ఇందులో మూడుకప్పుల పోట్లీమసాలా, నీళ్లు వేసి బాగా మరిగించాలి. ఉడికించిన గోధుమ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేయాలి. అవసరమైతే మరికాస్త ఉప్పు కూడా చేర్చి అరగంటపాటు పొయ్యి మీద ఉంచాలి. దింపేముందు మిగిలిన నెయ్యి వేస్తే సరిపోతుంది. వేడివేడి హలీమ్‌ చాలా రుచిగా ఉంటుంది.

చింతచిగురు మాంసం

కావలసినవి:
చింతచిగురు: అరకిలో, మాంసం(చికెన్‌ లేదా మటన్‌):అరకిలో, కొబ్బరితురుము: 2 టీస్పూన్లు, కొత్తిమీర: కట్ట, దనియాలపొడి: టీస్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, పుదీనా: కట్ట, ఆవాలు: టీస్పూను, నూనె: టేబుల్‌స్పూను, ఉల్లిపాయ: ఒకటి, కారం: 2 టీస్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: చిటికెడు, గరంమసాలా: టీస్పూను
తయారుచేసే విధానం:
నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు కూడా వేసి అవి వేగాక, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరవాత కొబ్బరితురుము వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు మటన్‌ లేదా చికెన్‌ ముక్కలు వేసి ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరవాత దనియాలపొడి, కారం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మాంసం ఉడికేవరకూ ఉంచాలి. ఉడికిన తరవాత చింత చిగురు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా గరంమసాలా వేసి ఓ నిమిషం ఉంచి దించాలి.

చేప బిర్యానీ

కావలసినవి:
చేపముక్కలు(పండుగప్ప): అరకిలో, షాజీరా: టీస్పూను, బాస్మతిబియ్యం: 4 కప్పులు, ఉల్లి పాయలు: పావుకిలో, పచ్చిమిర్చి: 12, పుదీనా: కట్ట, కొత్తిమీరకట్ట, కారం: టీస్పూను, పసుపు: పావు టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: వేయించడానికి  సరిపడా, మిరియాలపొడి: టీస్పూను, నెయ్యి: 50గ్రా., గరంమసాలా: అరటేబుల్‌స్పూను, పెరుగు: కప్పు, నిమ్మరసం: 3 టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు: కొద్దిగా (నాలుగు టేబుల్‌ స్పూన్ల గోరువెచ్చని పాలల్లో నానబెట్టాలి), అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం:
ప్రెషర్‌ పాన్‌ లేదా మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అల్లంవెల్లుల్లి, నాలుగైదు చీల్చిన పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా ఆకులు, ఉప్పు, గరంమసాలా వేసి, ఓ నిమిషం వేయించాక బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి సగం ఉడికించాలి.కడిగిన చేపముక్కలకు కొద్దిగా నిమ్మరసం, కారం, పసుపు, పెరుగు, ఉప్పు పట్టించాలి.బాణలిలో టీస్పూను నూనె వేసి మిగిలిన వాటిలో సగం పచ్చిమిర్చి, సగం పుదీనా ఆకులు, కొత్తిమీర తురుము వేసి రెండు నిమిషాలు వేయించాక, చల్లారనివ్వాలి. తరవాత ముద్దలా చేసి, మిరియాలపొడితో సహా చేపముక్కలకు పట్టించాలి.బాణలిలో కొద్దిగా నూనె వేసి గుండ్రంగా కోసిన ఉల్లిముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అలాగే పొడవుగా చీల్చిన మిగిలిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తురుము కూడా వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి.మందపాటి గిన్నెలో ఓ టీస్పూను నూనె వేసి, అన్నీ పట్టించి ఉంచిన చేపముక్కల మిశ్రమాన్ని పరిచి, దానిమీద ఉల్లిముక్కల మిశ్రమాన్ని చల్లి నిమ్మరసం పిండాలి. వీటిమీద సగం ఉడికించిన అన్నం వేసి, ఆపైన ఓ టీస్పూను వేడి నూనె, టీస్పూను నెయ్యి చల్లాలి. వాటిమీద కుంకుమపువ్వు కలిపిన పాలు పోసి మూతపెట్టి సిమ్‌లో 25 నిమిషాలు ఉడికించి దించాలి.

కొరమీనుతో కమ్మగా

కావల్సినవి:
కొరమీను చేప - ఎనిమిది వందల గ్రా, (రెండు వందల గ్రా చొప్పున కోయాలి), తాజాఅల్లం, వెల్లుల్లి రెబ్బలు - వంద గ్రా చొప్పున,పుదీనా ఆకు - రెండు వందల గ్రా, పచ్చిమిర్చి - డెబ్భై అయిదు గ్రా, పొద్దుతిరుగుడు నూనె - యాభై ఎంఎల్‌, తాజా కొబ్బరి తురుము - వంద గ్రా, ఉప్పు - ముప్ఫై గ్రా, వాము - పది గ్రా, అరటిఆకులు - నాలుగు.
తయారీ:
ముందుగా కడిగిన పుదీనా ఆకులు, అల్లం తరుగు, కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తీసుకుని నీళ్లు చేర్చకుండానే మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇందులో వాము, ఉప్పు కలపాలి. ఇప్పుడు ఒక్కో అరటి ఆకును చతురస్రాకారంలో కత్తిరించి నూనె రాయాలి. నాలుగు చేపముక్కల్ని ఒక్కో ఆకుపై ఉంచి.. పైన మసాలా మిశ్రమం రాసి చుట్టూ మూసి అవసరమైతే దారం చుట్టాలి. వీటిని ఆవిరిమీద ఇరవై నిమిషాలు ఉడికించి తీసేయాలి. వేడివేడిగా తింటేనే రుచి.

No comments:

Post a Comment